తెలుగు టీమ్కు ఆడటం చాలా ఇష్టం- రోహిత్ శర్మ
తెలుగు టీమ్కు ఆడటం చాలా ఇష్టం- రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ గుడ్బై పలుకుతాడని, ఐపీఎల్లో బ్లూ జెర్సీతో బరిలోకి దిగడం హిట్మ్యాన్కు ఇదే ఆఖరి సీజన్ అని గత కొన్నిరోజులు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అంతేగాక రోహిత్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని, దీనికోసం రోహిత్కు ఎస్ఆర్హెచ్ సహయజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ ఆఫర్ చేసిందని కూడా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ తెలుగు జట్టు గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో రోహిత్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతాడని నెట్టింట తీవ్రంగా చర్చ సాగుతుంది. తెలుగు టీమ్ గురించి హిట్మ్యాన్ అసలేం చెప్పాడంటే...
ఐపీఎల్లో రోహిత్ తెలుగు జట్టు అయిన డెక్కన్ ఛార్జర్స్ తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో డెక్కన్ ఛార్జర్స్ జట్టుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని, దిగ్గజాల మధ్యలో ఆడుతూ ఆటలో పురోగతి సాధించానని చెప్పాడు.
''డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోజుల్లో ఆడమ్ గిల్క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్తో కలిసి ఆడటాన్ని ఎంతో ప్రేమించా. ఆ టీమ్లో కుర్రాడిగా వెళ్లిన నేను ఎంతో నేర్చుకున్నా. ఆ సమయంలో నా వయస్సు 20 ఏళ్లే. దిగ్గజాల మధ్య ఆటను నేర్చుకోవడం గొప్పగా అనిపించింది'' అని రోహిత్ తెలిపాడు. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ 45 మ్యాచ్లు ఆడాడు. 30 సగటుతో 890 పరుగులు సాధించాడు. అంతేగాక ముంబై ఇండియన్స్పైనే రోహిత్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.
అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించిన విషయం తెలిసిందే. దీంతో ముంబై ఫ్రాంచైజీపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం ముంబైను రోహిత్ వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ మెగా వేలంలో హిట్ మ్యాన్ బరిలోకి దిగుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.