కలవరానికి గురిచేస్తోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...!
కలవరానికి గురిచేస్తోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్ల కల్లోలం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో వెలుగుచూసిన మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. బ్రిటన్లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ ఇప్పటికే 80 దేశాలకు పైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించింది. సాధారణ రకం కంటే దాదాపు 30 నుంచి 70శాతం వేగంతో వ్యాప్తిచెందడమే కాకుండా బ్రిటన్లో కొవిడ్ మరణాలు పెరగడానికి ఈ రకం కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత్లో మాత్రం వీటి ప్రభావం తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇప్పటివరకు 87,40,595 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వారిలో 85,69,917 మంది మొదటి డోసు, 1,70,678 మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. అలాగే 14 రాష్ట్రాలు 70 శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసినట్లు తెలిపారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో 42 శాతం మంది వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు వేసినట్లు తెలిపారు. పది రాష్ట్రాలు కేవలం పది శాతం మంది సిబ్బందికే టీకాలు పంపిణీ చేశాయని పేర్కొన్నారు.
ఇక, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో వెలుగుచూస్తున్న కొత్త కేసులు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే మరోసారి అత్యధిక కేసు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో 61,550, మహారాష్ట్రలో 37,383 క్రియాశీల కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 72 శాతమని రాజేశ్ వెల్లడించారు.
ఇక కొత్త రకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడు రోజులుగా ప్రతి పదిలక్షల మందిలో 56 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, గడిచిన 24గంటల వ్యవధిలో 9,121 మంది కరోనా బారిన పడగా, 81 మంది ప్రాణాలను కోల్పోయారు.
