లక్ష కోట్లతో కొత్త బ్యాంక్…!
లక్ష కోట్లతో కొత్త బ్యాంక్…!
కేంద్ర ప్రభుత్వం ఓ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దీనిపై ప్రకటన చేస్తారని పేర్కొంటున్నాయి. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లకు దేశంలోనే అతి తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఫండ్స్ కొంత మొత్తాన్ని కచ్చితంగా ఈ బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్న షరతులను కూడా విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. మొత్తంగా లక్ష కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ను ఏర్పాటు చేసే ఆలోచన ఉండగా, మొదట రూ.20 వేల కోట్లతో కార్యకాపాలను ప్రారంభిస్తారని జాతీయ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్ 2020 పేరుతో రూపొందించారని, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ను ఇది రీప్లేస్ చేస్తుందని చెబుతున్నారు. ఈ బ్యాంకుకు సర్వాధికారాలతో పాటు స్వయం ప్రతిపత్తి కూడా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు నివేదించినట్టు ఆ కథనాల సారాంశం. మొత్తంగా దీనిపై బడ్జెట్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
