చిరాకు పెట్టిస్తున్నాయని చీమలకు నిప్పు పెడితే చివరికి...!
చిరాకు పెట్టిస్తున్నాయని చీమలకు నిప్పు పెడితే చివరికి...!
చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం (నవంబర్ 22, 2020) న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం స్ట్రీటు కు చెందిన సత్యమార్తి దంపతులు, ఓ కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటున్నారు. కూతురు సంగీత షోలింగనల్లూరులోని ఒక ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు.
ఈ క్రమంలో వారి ఇంటి నిండా చీమలు పుట్టలు పెట్టాయి. ఇంట్లో ఉండే అన్ని పదార్ధాల్లోను చీమలు పేరుకుపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూసినా చీమలు, చీమలు, చీమలు. దీంతో సంగీతకు చికాకు వచ్చేసింది. ఎన్నో చీమల మందులు వాడింది. అయినా ఇంట్లో చీమలు తగ్గలేదు. దీంతో ఆమె చాల అసహనానికి గురైంది.
ఈక్రమంలో సంగీత తల్లి సహాయంతో చీమలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. చీమలు చెల్లాచెదురుగా పారిపోతుంటే సంగీత వాటిపై కూడా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. దీంతో ఆ మంటలు సంగీత బట్టలకు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి ఒళ్లంతా పాకాయి. తల్లి, కూతురుకి అంటుకున్న మంటలు ఆర్పటానికి తీవ్రంగా యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మంటల్లో నిలువునా కాలిపోయిన సంగీత తల్లి కళ్లముందే సజీవదహనం అయిపోతుంటే ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. పెద్ద పెద్దగా కేకలు వేసింది. మంటలు ఆర్పటానికి యత్నించింది. ఆమె కేకలకు వేరే గదిలో ఉన్న తండ్రీ సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు.
కళ్లముందే కొనఊపిరితో కొట్టుకుంటున్న సంగీతన పొరుగువారి సహాయంతో కిల్ పాక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు.
కానీ శరీరం చాలా వరకూ కాలిపోవటంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కూతుర్ని రక్షించే యత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలవ్వటంతో ఆమె చికిత్సపొందుతోంది. అందుకే నిప్పుతో మరియు నీటితో చలగాటం ప్రాణసంకటం అంటారు పెద్దలు.
